తెలంగాణలో రీసైక్లింగ్ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం సహకారం కోరిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పాత వాహనాల స్క్రాప్తో ఉక్కును రీసైక్లింగ్ చేసే పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు కలుగుతుందని వివరించారు.
గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో సిఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో భాగంగా రూపొందించిన పారిశ్రామిక ప్రతిపాదనలను కేంద్ర మంత్రులకు వివరించారు.
తెలంగాణలో రీసైక్లింగ్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులను కోరుతూ ఈ సందర్భంగా వినతిపత్రం అందించారు. అందుబాటులో ఉన్న సాంకేతికత, భారీ పరిశ్రమలు, పారిశ్రామిక ఉత్పత్తికి ఉన్న అనుకూలతల వలన దేశ పారిశ్రామిక ఉత్పత్తి లక్ష్యాలకు హైదరాబాద్ కేంద్రంగా నిలవగలదని వివరించారు.
హైదరాబాద్లో హైడ్రోజన్ టెక్నాలజీతో గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఆటో, రక్షణ రంగాలకు అవసరమైన ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని సిఎం కోరారు. అలాగే మెషిన్ టూల్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక పరికరాల తయారీకి ప్రత్యేక పార్క్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
2034 నాటికి హైదరాబాద్ను కాలుష్యం లేని నెట్ జీరో నగరంగా మార్చే లక్ష్యంతో వాహనాలను ఈవీలుగా మార్చేందుకు సహకరించాలని పేర్కొన్నారు. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పే జాతీయ స్థాయి సంస్థలను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర మంత్రులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.
తెలంగాణలో రీసైక్లింగ్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు
తెలంగాణ రాష్ట్రంలో రీసైక్లింగ్ పరిశ్రమల ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు చేసారు.