సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ ఆగ్రహం: 'జడ్జిలను చూసి సిగ్గుపడుతున్నా
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, సుప్రీంకోర్టు తీర్పుపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు జడ్జిలను చూసి సిగ్గుపడుతున్నానని, వారి తీర్పు తీవ్రంగా నిరాశపరిచిందని దుయ్యబట్టారు.
ట్రంప్ విధించిన సుంకాలు చెల్లబోవు అని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసిన సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు జడ్జిలు విదేశీ ప్రభావానికి లోనయ్యారని, ఎట్టి పరిస్థితుల్లో టారిఫ్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు.
ట్రంప్ సుంకాలను వ్యతిరేకించిన వారిలో ఆరుగురు జడ్జిల్లో నలుగురు మహిళలు అమీకోనీ బారెట్, సోనియా సోటోమేయర్, ఎలెనా కగన్, కేతాంజీ బ్రౌన్ జాక్సన్, ఇద్దరు పురుషులు జాన్ రాబర్ట్స్, నీల్ గోర్సుచ్ ఉన్నారు. ట్రంప్ సుంకాలను సమర్థించిన ముగ్గురు జడ్జిల్లో క్లారెన్స్ థామస్, బ్రెట్ కవనాఫ్, శామ్యూల్ అలిటో ఉన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 10 శాతం గ్లోబల్ టారిఫ్ ఆర్డర్స్ పై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఆయనకు అత్యంత ఇష్టమైన పదం టారిఫ్ అని ప్రకటించుకోవడమే కాకుండా, ఎడాపెడా సుంకాలు వేస్తూ ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా తన దారి కి తెచ్చుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ షాక్ తగిలింది.
ఇప్పటి వరకు ట్రంప్ విధించిన సుంకాలు చెల్లబోవు అని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆయా దేశాల వద్ద నుంచి వసూలు చేసిన అదనపు సుంకాలను తిరిగి వారికి చెల్లించాలని స్పష్టం చేసింది. ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారని మొట్టికాయలు వేసింది. దేశ వాణిజ్య భాగస్వాముల పై సుంకాలు విధించడం చట్ట విరుద్ధమని, అధికార పరిధిని మించిపోవడమేనని ఘాటైన వ్యాఖ్యలు చేసింది.
ఏకపక్షంగా సుంకాలు విధించడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన అత్యవసర వినియోగాల చట్టాన్ని అతిక్రమించారని అభిప్రాయపడింది. శుక్రవారంనాడు అమెరికా సుప్రీంకోర్టు ధర్మాసనం 6-3 తేడాతో ఈ చరిత్రాత్మక తీర్పును వెలువరించింది.