తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం లక్షల మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకంకు సంబంధించి కీలక విషయాన్ని చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రెండో విడత ఇళ్ల పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదవారికి సొంతింటి కల
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తెలంగాణలోని ప్రతి పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందులో భాగంగా దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తోంది. తాజాగా.. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. తొలి విడతలో భాగంగా 4.50లక్షల ఇళ్లను మంజూరు చేశామని.. వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇళ్లకు గృహ ప్రవేశాలు చేస్తామని చెప్పారు.
వచ్చే జూన్ నాటికి మరో రెండు లక్షల గృహ ప్రవేశాలు
వచ్చే జూన్ నాటికి మరో రెండు లక్షల గృహ ప్రవేశాలు జరుగుతాయని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు కేటాయించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. 2026 ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రారంభమవుతుందని మంత్రి ప్రకటించారు.
మధ్య తరగతి కుటుంబాల కోసం ఇళ్లు కేటాయింపు
మధ్య తరగతి కుటుంబాల కోసం కూడా ప్రత్యేకంగా ఇళ్లు కేటాయింపు ప్రక్రియను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. తాజాగా.. మంత్రి ప్రకటనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాల్లో కొత్త ఆశలు మళ్లీ వెల్లివిరిశాయి.
జీప్లస్ త్రీ, జీ ప్లస్ ఫోర్ విధానంలో ఇళ్ల నిర్మాణం
జీప్లస్ త్రీ, జీ ప్లస్ ఫోర్ విధానంలో అర్బన్ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి చెప్పారు. జీ ప్లస్ త్రీ పద్దతిలో నిర్మించే గృహాల కోసం అతికొద్ది రోజుల్లో పాలసీని ప్రకటించబోతున్నామని అన్నారు.
ఒకే చోట ఎనిమిది నుంచి 10వేల ఇండ్లు నిర్మాణం
దీనికోసం ఓఆర్ఆర్ చుట్టూ నాలుగు స్థలాలను గుర్తించామని, ఒక్కో చోట ఎనిమిది నుంచి 10వేల ఇండ్లు నిర్మించే ప్రతిపాదన ఉందని మంత్రి పొంగులేటి చెప్పారు.